ఆలోచన.. ఆచరణ.. విజయం
అదే ‘మేరా ఈవెంట్స్’

అదే ‘మేరా ఈవెంట్స్’
ఏదైనా ఒక మంచి కంపెనీ పెట్టాలి. ఇంత వరకూ అటువంటి సేవలందించే కంపెనీ ఉండకూడదు. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ‘మేరా ఈవెంట్స్’ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) చెన్నపనాయుడు దారపనేని తపన ఇది. ఎటువంటి కంపెనీ పెట్టాలన్న అంశాన్ని తెలుసుకోవడానికి అనేక సెమినార్లు, సమావేశాలకు హాజరయ్యేవారు. అప్పట్లో సెమినార్లు, సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకోవడం, టికెట్లు కొనుగోలు చేయడం కష్టంగా ఉండేది. అప్పుడే దీనిపైనే వ్యాపారం ఎందుకు ప్రారంభించకూడదన్న ఆలోచన వచ్చింది. అంతర్జాలం విస్తరిస్తున్న ఆ సమయంలో ఆన్లైన్లో అన్ని రకాల ఈవెంట్ల టికెట్లను విక్రయిస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. ఈదిశగా 2007లో అడుగులు వేశారు. చివరకు 2009 అక్టోబరులో ‘మేరా ఈవెంట్స్ డాట్ కామ్’ ప్రాణం పోసుకుంది. అప్పటి వరకూ దేశంలో ఈవెంట్ల టికెట్లను ఆన్లైన్లో విక్రయించే కంపెనీ లేదు. మొదట్లో ఆన్లైన్లో టికెట్లు విక్రయించడం ఏమిటి? ఎవరు కొంటారన్న వారు చాలామందే ఉన్నారని, అప్పటికీ, ఇప్పటికీ పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని అంటారు సాధారణ రైతు కుంటుంబం నుంచి వచ్చిన చెన్నప నాయుడు. ఇంజినీరింగ్ చదివే రోజల్లో వార్తా పత్రికలు విక్రయించే వాడినని, అప్పట్లో నేర్చుకున్న క్రమశిక్షణ, సమయపాలన తన కెరీర్లో ఎంతో ఉపయోగపడిందని చెబుతున్నారు.
మొదట్లో రోజుకు 10 టికెట్లు కూడా విక్రయించడం కష్టమయ్యేది. మొదటి ఏడాది కేవలం రూ.కోటి విలువైన టికెట్లను మాత్రమే విక్రయించారు. టికెట్ల విక్రయానికి తమ వెబ్సైట్ను ఉచితంగా వినియోగించుకోమన్నా, చాలామంది ఈవెంట్ నిర్వహకులు ముందుకు వచ్చేవారు కాదని నాయుడు గుర్తు చేసుకున్నారు. వినోదం, వృతి నిపుణుల సదస్సులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శిక్షణ తరగతుల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు, వాణిజ్య ప్రదర్శనల వరకూ అన్ని ఈవెంట్ల టికెట్లను మేరాఈవెంట్స్ డాట్కామ్ విక్రయిస్తోంది. అన్ని రకాల ఈవెంట్ల టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్న కంపెనీ ప్రస్తుతానికి దేశంలో ఇది ఒక్కటే. 2014లో రూ.15 కోట్ల విలువైన లక్ష టికెట్లను ఈ వెబ్సైట్లో విక్రయించారు. దేశంలో జరిగే కనీసం 1,000 ఈవెంట్లకు చెందిన టికెట్లు, సమాచారం ఈ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. ప్రతి రోజు 15 వేల మంది ఈ సైట్ను సందర్శిస్తున్నారు. కొత్త సంవత్సరం వంటి ప్రత్యేక సందర్భాలలో భారీగా టికెట్లు విక్రయం అవుతున్నట్లు నాయుడు చెబుతున్నారు. ఈవెంట్ నిర్వహకుల నుంచి టికెట్ ఖరీదులో 10 శాతాన్ని రుసుముగా ఈ వెబ్సైట్ వసూలు చేస్తోంది. చిన్న, చిన్న ఈవెంట్ల నిర్వహకులు ఈ వెబ్సైట్ ద్వారా టికెట్లు విక్రయించడానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. పేమెంట్ గేట్ వే ఛార్జీల కింద టికెట్ ఖరీదులో 2 శాతం చెల్లిస్తే సరిపోతుంది. ఆన్లైన్లో ముందుగా టికెట్లు కొనుగోలు చేస్తే, పాల్గొనే వారికి తక్కువ ధరకు టికెట్ లభిస్తుంది. వరుసల్లో నిలబడాల్సిన అవసరం ఉండదు.
అసంఘటిత రంగంలోనే అధికం
దేశంలో ఈవెంట్ టికెట్ విక్రయాల్లో అధిక భాగం అసంఘటిత రంగంలోనే జరుగుతున్నాయి. ఈ మార్కెట్ విలువ దాదాపు రూ.5,000 కోట్లు ఉంటుంది. ఇందులో ఆన్లైన్ టికెట్ విక్రయాలు రూ.500 కోట్లు కూడా లేవు. ఈ నేపథ్యంలో పెద,్ద పెద్ద ఈవెంట్ నిర్వహణ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని 2015లో రూ.100 కోట్ల విలువైన 5 లక్షల టికెట్లను విక్రయించాలని మేరాఈవెంట్స్ లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో మరింతగా విక్రయాలు పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ‘సన్బర్న్’ ఈవెంట్లను నిర్వహించే పర్సెప్ట్ లైవ్ కంపెనీతో టికెట్ల విక్రయానికి ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ దేశంలో ఏడాదికి 70-80 ఈవెంట్లను నిర్వహిస్తోంది. రూ.50-60 కోట్ల విలువైన టికెట్లను విక్రయిస్తోంది. రూ.కోటి, అంతకంటే ఎక్కువ మొత్తం టికెట్లను విక్రయించే వందకు పైగా ఈవెంట్ నిర్వహణ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని కూడా మేరాఈవెంట్స్ యోచిస్తోంది. విదేశాల్లో జరిగే ఈవెంట్ల టికెట్లను విక్రయించేందుకు కార్యకలాపాలను విస్తరించనుంది. జూన్ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుంది. మార్కెటింగ్, మరింత పటిష్ఠమైన సర్వర్ల ఏర్పాటు, టెక్నాలజీ నవీకరణకు అవసరమైన నిధుల కోసం దాదాపు రూ.60 కోట్లు (10 మిలియన్ డాలర్లు) సమీకరించనుంది. గత అయిదేళ్లలో అంతర్గత సమీకరణ ద్వారా నాయుడు రూ.7 కోట్ల పెట్టుబడులు పెట్టగా, ఆరు నెలల క్రితం ఒమెక్స్ గ్రూప్ రూ.6 కోట్లు అందించింది. ఒమెక్స్ గ్రూప్ ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో 300 సెమినార్లను నిర్వహిస్తోంది. వీటికి విచ్చేసే వారికి రూ.50 కోట్ల విలువైన టికెట్లను విక్రయిస్తోంది. వచ్చే 3-6 నెలల్లో మరో రూ.60 కోట్లు సమీకరించనున్నామని.. ఒకటి, రెండు వెంచర్ కేపిటలిస్ట్ ఫండ్లు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు పెట్టు బడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని నాయుడు చెప్పారు.
No comments:
Post a Comment